మున్సిపల్ ఎన్నికలపై టిడిపి వాకౌట్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రానందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.
ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కదని తెలుగుదేశం సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. 1956 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ నాలుగు సార్లు మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించిందని ఆయన అన్నారు. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం గడువు ముగిసిన ఆరు నెలల లోపల మున్సిపల్ ఎన్నికలను నిర్వహించవచ్చునని ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోందని టిడిపి విమర్శించింది. స్థానిక సంస్థలపై దొడ్డిదారిన అధికారం చెలాయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. దొడ్డి దారి, వెన్నుకపోటు చంద్రబాబు పేటెంట్ హక్కులని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.