ఆఫ్రిదీ మెరుపు సెంచరీ: పాక్ ఘన విజయం
కాన్పూర్: షాహిద్ ఆఫ్రిదీ మెరుపు సెంచరీతో భారత్పై పాకిస్థాన్ కాన్పూర్లో శుక్రవారం జరిగిన ఐదవ వన్డే మ్యాచ్ను సునాయసంగా గెలుచుకుంది. భారత్ తన ముందుంచిన 250 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ఐదు వికెట్లు నష్టపోయి 42.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఆరు వన్డేల సిరీస్లో భారత్పై పాకిస్థాన్ 3-2 స్కోర్తో ఆధిక్యత సాధించింది. ఇప్పుడు సిరీస్ను సమం చేయడానికి భారత్ తంటాలు పడాల్సి ఉంది. ఆఫ్రిదీ కేవలం 45 బంతుల్లో సెంచరీ చేశాడు. అతను 102 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హర్బజన్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆఫ్రిదీ సెంచరీలో 9 సిక్స్లు, 10 ఫోర్లు ఉన్నాయి. కుంబ్లే ఒక ఓవర్లోనే 23 పరుగులు ఇచ్చుకున్నాడు. బాలాజీ రెండు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చాడు. ఆఫ్రిదీ దూకుడుకు భారత బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఆఫ్రిదీ క్రీజ్లో ఉన్నంత సేపు మ్యాచ్ ఏకపక్షంగా నడిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఆఫ్రిదీ ఎంపికయ్యాడు. రెండో ఫాసెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్మన్గా ఆఫ్రిదీ రికార్డు సృష్టించాడు.
ఆఫ్రిదీ తర్వాత మైదానంలోకి దిగిన పాకిస్థాన్ బ్యాట్స్మన్ చాలా సునాయసంగా, నింపాదిగా తమ బాధ్యత నెరవేర్చి విజయాన్ని అందుకున్నారు. షోయబ్ మాలిక్ 41 పరుగులు చేశాడు. ఇంజమామ్ 24 పరుగులతో నాటవుట్గా మిగిలాడు. కంబ్లేకు రెండు వికెట్లు లభించగా హర్బజన్, సెహ్వాగ్, టెండూల్కర్ ఒక్కటేసి వికెట్లు తీసుకున్నారు. టాస్ గెలిచి ద్రావిడ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇదే భారత్ కొంప ముంచింది. భారత ఓపెనర్లు టెండూల్కర్, సెహ్వాగ బ్యాటింగ్లో విఫలం కావడంతో భారత్ కష్టాల్లో పడింది. 33 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్ హసన్ తొలి మూడు వికెట్లు తీసి భారత్ను కష్టాల్లో పడేశాడు. కెప్టెన్ ద్రావిడ్, కైఫ్ల భాగస్వామ్యంతో భారత్ కోలుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 249 పరుగులు చేసింది. కైఫ్ 78 పరుగులు చేయగా ద్రావిడ్ 86 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. దినేష్ మోంగియా 28 బంతుల్లో 33 పరుగులు చేశాడు.