శిక్షణాశిబిరంలో పేలుడు: 4గురికి గాయాలు
నిజామాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫాసిస్టు ధోరణితో ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని విప్లవ రచయితల సంఘం (విరసం) అధ్యక్షుడు జి. కళ్యాణరావు విమర్శించారు. నక్సల్స్ సమస్యలకు కారణాలేమిటో అర్థం చేసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాద్లో 13 నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ల జనరల్స్ (డిజిపిలు) సమావేశం ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
నక్సల్స్ సమస్యను రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యగా పరిగణిస్తూ పరిస్కారానికి చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల సమస్యగానే పరిగణిస్తూ నక్సల్స్ పార్టీలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే డిజిపిల సమావేశం జరుగుతోందని ఆయన అన్నారు. పోలీసులకు అత్యధునాత ఆయుధాలు, హెలికాప్టర్లు సమకూరుస్తూ కూంబింగ్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు.
హైదరాబాద్లో జరిగిన 13 రాష్ట్రాల డిజిపిల, హోం కార్యదర్శుల సమావేశం ప్రమాద సంకేతమని విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు వరవరరావు హైదరాబాద్లో అన్నారు. గ్రేహౌండ్స్ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటూ నక్సల్స్ అణచివేతకు చర్యలు చేపట్టబోతోందని ఆయన అన్నారు. దేశసరిహద్దుల్లోని సైనికులకు ఇచ్చే శిక్షణను అంతర్గత భద్రతకు నియోగించిన బలగాలకు ఇస్తుందని, ఇది ప్రమాద సంకేతమని ఆయన అన్నారు.
13 రాష్ట్రాల డిజిపిలు, హోం కార్యదర్శులు, ఇంటలిజెన్స్ అధికారులు శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని తాజ్ కృష్ణా హోటల్లో సమావేశమయ్యారు. నక్సల్స్ సమస్య పరిష్కారానికి ఒక జాతీయ వ్యూహాన్ని అనుసరించేందుకు ఈ సమావేశం ఏర్పాటయింది.