సాగునీటిపై వైఖరి వెల్లడించాలి: బిజెపి డిమాండ్
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఇంత పెద్ద యెత్తున సాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్నప్పుడు ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించడం అవసరమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను చేపట్టే విషయంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడటం ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రాయలసీమకు మాత్రమే మేలు జరిగేలా చూస్తున్నారనే భావన బలపడుతోందని, ఇది మంచిది కాదని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సాంకేతికపరమైన ఇబ్బందులనే కాకుండా ప్రభుత్వం నీటి లభ్యత, టెండర్ల వంటి వాటిలో కూడా సమస్యలను ఎదుర్కుంటోందని ఆయన అన్నారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.