ప్రభుత్వానికి యంఆర్పియస్ రెండు వారాల గడువు
హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల రిజర్వేసన్ల వర్గీకరణకు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యం ఆర్పియస్) రెండు వారాల గడువు ఇచ్చింది. ఆదివారం ఉదయం పదిన్నర లోగా తేల్చి చెప్పాలని డిమాండ్ చేసిన యం ఆర్పియస్ సీనియర్ మంత్రి కోనేరు రంగారావు హామీతో ప్రభుత్వానికి మరో రెండు వారాల గడువు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంటులో చట్టం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ యంఆర్పియస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాదయాత్ర చేపట్టారు. ఆయన పాదయాత్ర శనివారం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ధర్మయుద్ధ మహాసభ జరిగింది. కేంద్రం పార్లమెంటులో చట్టం ప్రవేశపెట్టేలా ఒత్తిడి తేవడానికి ఢిల్లీకి అఖిల పక్ష కమిటీని పంపాలని కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. అఖిల పక్ష సమావేశాన్ని ఎప్పుడు పంపుతారో ఆదివారం ఉదయం పదిన్నర లోగా తేల్చి చెప్పాలని ధర్నా చేపట్టారు. దీంతో కోనేరు రంగారావు మందకృష్ణ మాదిగతో చర్చలు జరిపారు. ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దీంతో యం ఆర్పియస్ ప్రభుత్వానికి మరో రెండు వారాల గడువు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
ఈ సందర్బంగా తెలుగుదేశం నాయకుడు మాచర్ల జగన్నాథం, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ మంద కృష్ణ మాదిగ చర్చలు జరిపారు.