డెంటిస్టు చంద్రకాంత్కు 24వరకు జ్యుడిష్యల్ కస్టడీ
హైదరాబాద్: భూకబ్జా కేసులో ప్రముఖ దంత వైద్యుడు చంద్రకాంత్కు ఈ నెల 24వ తేదీ వరకు జ్యుడిష్యల్ రిమాండ్ విధిస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంద్రకాంత్ను పోలీసులు హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లి జైలుకు తరలించారు. చంద్రకాంత్ను ఈ నెల 10వ తేదీన అరెస్టు చేసి మర్నాడు కోర్టులో హాజరు పరిచారు. తనకు ఛాతీలో నొప్పి వస్తుందంటూ సాకు చూపి చంద్రకాంత్ ఆస్పత్రిలో చేరే ప్రయత్నం చేశారు. చంద్రకాంత్కు పరీక్షలు నిర్వహించి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవని నిమ్స్ వైద్యులు తేల్చారు.
మాదాపూర్లోని పత్రికానగర్లో అక్రమంగా భూకబ్జాలకు పాల్పడ్డారంటూ చంద్రకాంత్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్లోని పత్రికానగర్లో బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్నాడంటూ చంద్రకాంత్పై కేసు నమోదైంది. ప్రభుత్వంతో చర్చల సందర్భంగా మావోయిస్టు నేతలకు దంత వైద్యం చేసిన చంద్రకాంత్ ఆ సందర్భంగా వారితో తీయించుకున్న ఫొటోలను చూపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలున్నాయి. భూకబ్జాల విషయంలో మావోయిస్టు మాజీ ప్రతినిధి కళ్యాణరావు చంద్రకాంత్తో మాట్లాడారని మరో మాజీ ప్రతినిధి వరవరరావు నక్సల్స్ నేతలకు రాసిన లేఖను పోలీసులు బయటపెట్టడంతో తీవ్ర సంచలనం చెలరేగింది.