తెనాలి ఎంపి ఇంటిని పేల్చేసిన మావోయిస్టులు
గుంటూరు: గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడులో తెనాలి లోక్సభ సభ్యుడు బాలశౌరి ఇంటిని మావోయిస్టులు పేల్చివేశారు. ఇంటిలో ఉన్న బాలశౌరి తండ్రి జోజినాయుడును వెలుపలికి రమ్మని చెప్పి, గ్రామస్తులను పిలిచి గ్రేనెడ్లతో మావోయిస్టులు ఆ ఇంటిని పేల్చివేశారు. కృష్ణానదిపై ప్రభుత్వం తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టు విషయంలో చొరవ తీసుకున్నందుకే బాలశౌరి ఇంటిని వారు పేల్చివేసినట్లు సమాచారం. బాలశౌరి ఇంటి నుంచి రెండు లక్షల రూపాయల నగదును, లక్ష రూపాయల విలువ చేసే బంగారు నగలను మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
పులిచింతల ప్రాజెక్టుకు పర్యావరణ, ఇతర అనుమతులను తీసుకురావడంలో బాలశౌరి చురకుగా పని చేశారు. పులిచింతల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఆయన పదే పదే ప్రకటనలు చేశారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మావోయిస్టులు ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు.