నక్సల్స్ నేతలను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
నిజామాబాద్: మావోయిస్టు నేతలు గంటి ప్రసాద్, సురేంద్రలను పోలీసులు సోమవారంనాడు కోర్టులో హాజరు పరిచారు. విచారణ నిమిత్తం వీరిని పోలీసులు ఈ నెల 9వ తేదీన తమ కస్టడీలోకి తీసుకున్నారు. గడువు తీరిపోవడంతో పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. ఈ నెల 17వ తేదీన వారి జ్యుడిష్యల్ కస్టడీ గడువు ముగుస్తుంది.
విచారణ సందర్భంగా తమను పోలీసులు శారీరకంగా హింసించలేదని గంటి ప్రసాద్ చెప్పారు. విచారణ కోసం తమను హైదరాబాద్ తీసికెళ్లినట్లు ఆయన తెలిపారు. తమ నుంచి పోలీసులు ఏమీ రాబట్టుకోలేకపోయారని ఆయన అన్నారు. మావోయిస్టులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని విప్లవ కవి వరవరరావు విమర్శించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మాట కూడా చెల్లుబాటవుతున్నట్లు లేదని ఆయన అన్నారు. నక్సల్స్ సానుభూతి పరులను పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చేస్తున్నారని ఆయన విమర్శించారు.