జులై 4నుంచి ఆర్టీసి కార్మికుల సమ్మె
హైదరాబాద్: జులై 4వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టీసి) సమ్మె ప్రారంభం కానుంది. ఆర్టీసి యాజమాన్యానికి, ఆర్టీసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె తప్ప మార్గాంతరం లేదని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రకటించారు. యాజమాన్యానికి, కార్మిక నాయకులకు మధ్య సోమవారం అదనపు లేబర్ కమీషనర్ వద్ద చర్చలు జరిగాయి.
తమ సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని తేలిపోయిందని, తాము అనుకున్నట్లే అయిందని ఐక్య కార్యాచరణ సమితి నాయకులన్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకునే ఏ చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని వారు చెప్పారు.
సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ ఆర్టీసి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. తమ సంస్థ యాజమాన్యం పరిధిలో ఉన్న కార్మికుల డిమాండ్లను పరిష్కరించడానికి తాము చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వం కూడా కార్మికుల డిమాండ్ల విషయంలో కొంత మేరకు సానుకూలంగా ప్రతిస్పందించిందని ఆయన చెప్పారు.