కాంగ్రెస్తో పొత్తుపై నిర్ణయం తీసుకోలేదు: సిపియం
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే విషయంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ గృహ కల్ప పథకం పచ్చి మోసం, దగా అని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మురికివాడల అభివృద్ధికి ఒక విధానాన్ని ప్రకటించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐ ఐటి ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
పట్టణాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. పేదలకు రేషన్కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమం ఆచరణ సాధ్యం కాదని ఆయన అన్నారు. రేషన్కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తోందని, రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం ఏరివేత కార్యక్రమంగా మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. రేషన్కార్డుల పంపిణీకి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో లోపాలున్నాయని ఆయన అన్నారు. సంబంధిత అధికారులు వచ్చినప్పుడు కుటుంబసభ్యులందరూ ఉండాలని, ఆ తర్వాత పరిశీలన జరిపి రేషన్కార్డులు ఇస్తారని ప్రభుత్వం అంటోందని, ఇది ఆచరణ సాధ్యం కాదని ఆయన అన్నారు. రేషన్కార్డుల కోసం 40యేసి రూపాయలు వసూలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.