నక్సల్స్ ఆటకట్టుకు ఉమ్మడి టాస్క్ఫోర్స్
హైదరాబాద్: నక్సల్స్ను ఎదుర్కోవడానికి ఆరు రాష్ట్రాల ఉమ్మడి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని శుక్రవారం హైదరాబాద్లో జరిగిన 13 రాష్ట్రాల డిజిపిల, హోం కార్యదర్శుల, ఇంటలిజెన్స్ అధికారుల సమావేశం నిర్ణయించింది. సమావేశం వివరాలను కేంద్ర హోం శాఖ కార్యదర్శి దుగ్గల్ మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. 13 రాష్ట్రాల్లో నక్సల్స్ సమస్య ఉన్నదని, అయితే ఆరు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్నదని, ఈ ఆరు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించిందని ఆయన వివరించారు. నక్సల్స్ సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శం కావాలని ఆయన అన్నారు.
నక్సల్స్ను పోలీసు వ్యవస్థ నిలువరించగలదే గానీ నిర్మూలించలేదని ఆయన అన్నారు. నక్సల్స్ సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగానే కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా పరిగణించాలని సమావేశం నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఈ దృష్ట్యా ఆరు రాష్ట్రాలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటూ పరస్పరం అభివృద్ధి నమూనాలను పరస్పరం పంచుకుంటూ శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలనేది సమావేశ నిర్ణయమని ఆయన చెప్పారు. నక్సల్స్ను ఎదుర్కోవడానికి చేపట్టే కార్యాచరణ విషయంలో కూడా ఆరు రాష్ట్రాలు తమ అనుభావాలను పంచుకుంటాయని ఆయన చెప్పారు. నక్సల్స్పై నిషేధించడం, నిషేధించకపోవడమనేది సమస్య కాదని, శాశ్వత పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలేమిటనేది ప్రధానమని ఆయన అన్నారు.
నేటి సమావేశం గత సమావేశాల కన్నా భిన్నంగా జరిగిందని, ఒక సానుకూల దృక్పథాన్ని ఈ సమావేశం అందించిందని ఆయన అన్నారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు తమ తమ అభివృద్ధి ప్రణాళికలను, వాటి అమలును పరస్పరం పంచుకుంటూ అమలు చేయాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైందని ఆయన చెప్పారు.
నక్సల్స్ అణచివేతకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉంటే మంచిదని శుక్రవారం జరిగిన 13 రాష్ట్రాల డిజిపిల, హోం కార్యదర్శుల, ఇంటలిజెన్స్ అధికారల సమావేశం అభిప్రాయపడింది. ఎక్కువ మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్ జిత్ సేన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. 13 నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ జనరళ్లు, హోం కార్యదర్శులు, ఇంటలిజెన్స్ అధికారులు శుక్రవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు.
చట్టపరంగా నక్సల్స్ అణచివేతకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించినట్లు స్వరణ్జిత్ సేన్ చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించినట్లు హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. నక్సల్స్ సమస్య పరిష్కారానికి పాలనాపరంగా, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడినట్లు ఆయన తెలిపారు. నక్సల్స్ అణచివేతకు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అనుసరిస్తోందని, అలా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే విధానం అవలంభిస్తే సత్ఫలితాలు వస్తాయని సమావేశంలో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు.
నక్సల్స్ను ఎదుర్కునే సి ఆర్పియఫ్ జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు సి ఆర్పియఫ్ డైరెక్టర్ జనరల్ చెప్పారు. వారికి కౌంటర్ ఇంటలిజెన్స్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొంటున్న సమయంలో ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోందని, అందుకే ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. నక్సల్స్ సమస్యపై చర్చించేందుకు ఏర్పాటయిన 13 రాష్ట్రాల డిజిపిల, హోం కార్యదర్శుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
