ఎమ్మెస్సార్కు క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ
హైదరాబాద్: దేవాదాయ శాఖ నుంచి ఎం. సత్యనారాయణరావును తప్పించారు. ఆయనకు క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖను అప్పగించారు. సత్యనారాయణరావు కోరిక మేరకే ఈ శాఖ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. తనకు కావాల్సిన శాఖ గురించి కూడా ఎమ్మెస్పార్ సూచించినట్లు సమాచారం. ఆయన కోరిక మేరకే క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. ఆలయ భూముల అక్రమ విక్రయంపై జరుగుతున్న న్యాయవిచారణ ముగిసేవరకు లేదా మంత్రి వర్గ విస్తరణ జరిగే వరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖను తన వద్దనే ఉంచుకోవాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
ఆలయ భూముల అక్రమ విక్రయం కుంభకోణం బయటపడిన తర్వాత సత్యనారాయణరావు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆ రాజీనామాను తిరస్కరించారు. దాంతో కనీసం తన శాఖనైనా మార్చాలని సత్యనారాయణ రావు పట్టబడుతూ వచ్చారని తెలుస్తోంది. దీంతో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గాన్ని సంప్రదించి ఎమ్మెస్సార్ శాఖను మార్చినట్లు తెలుస్తోంది.