పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆందోళన: బాబు
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు ఆందోళన నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ధరల పెంపు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు సామాన్యుల బతుకులను దుర్భరం చేస్తున్నాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పన్నుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు.
పెట్రోల్ లీటర్ ధర రెండున్నర రూపాయలు, డీజిల్ ధర రెండు రూపాయలు పెరిగాయి. పెట్రోల్ లీటర్ ధర రూ.17.50 పైసలు కాగా దాని ధరను పన్నుల ద్వారా 45 రూపాయలకు ప్రభుత్వం పెంచిందని, అలాగే డీజిల్ లీటర్ ధర రూ.17.30 పైసలు కాగా పన్నుల వల్ల 31 రూపాయలకు పైగా అయిందని చంద్రబాబు చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం నాలుగు సార్లు పెంచిందని, ఆ పెంపు 20 శాతానికి పైగా ఉందని ఆయన అన్నారు. చైతన్యం ద్వారా ప్రజలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ధరల పెంపుపై ఉపేక్ష వహిస్తే మున్సిపల్ ఎన్నికల తర్వాత గ్యాస్, కిరోసిన్ ధరలు కూడా పెరుగుతాయని ఆయన అన్నారు. తమ ఆందోళనలో భాగంగా ఈ నెల 23వ తేదీన మున్సిపాలిటీల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 24, 25 తేదీల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు జరుగుతాయని, 26వ తేదీన సైకిల్ ర్యాలీలు జరుగుతాయని ఆయన చెప్పారు.
తమ సైకిల్ గుర్తు ఎటూ పోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమాజ్వాదీ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించడం వల్ల ఆ పార్టీకి కేటాయించిన ఎన్నికల గుర్తు సైకిల్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి వేరే గుర్తు కేటాయించవచ్చుననే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సైకిల్ గుర్తును ప్రాంతీయ పార్టీలకే కేటాయిస్తారని ఆయన అన్నారు.