తెలంగాణపై సోనియాతో కెసిఆర్ భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు మంగళవారంనాడు ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. తెలంగాణపై ఏర్పాటయిన ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను తొందరగా ఇచ్చేలా చూడాలని కెసిఆర్ సోనియాను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలపై, స్థానిక నాయకులపై నక్సలైట్లు తెస్తున్న ఒత్తిడిని కూడా ఆయన సోనియా దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఈ విషయమై చంద్రశేఖర్ రావు ఇప్పటికే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలుసుకున్నారు. తమ విజ్ఞప్తికి సోనియా గాంధీ సానుకూలంగా ప్రతిస్పందించారని టి ఆర్యస్ నేత ఎ. నరేంద్ర అన్నారు.
సోనియాతో చంద్రశేఖర్ రావు దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కూడా పాల్గొన్నారు. సమావేశం వివరాలను కెసి ఆర్ వెల్లడించలేదు. సోనియా నివాసం నుంచి బయటకు వచ్చిన అనంతరం కెసి ఆర్ విజయసూచికగా చేతులు ఊపుతూ వెళ్లిపోయారు. అనంతరం కెసి ఆర్ నివాసంలో టిఆర్యస్ నాయకులు సమావేశమయ్యారు.