ఎస్సి వర్గీకరణపై న్యాయసలహా: కొనేరు రంగారావు
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల ( ఎస్సి) రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు చెప్పారు. శ్రీనగర్లోని ఒక కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీ వచ్చిన మంత్రి మంగళవారంనాడు కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణకు వచ్చే నెలలో పరిష్కారం లభించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వర్గీకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద న్యాయ సలహా తీసుకోవడానికి ఒక డిప్యూటీ కార్యదర్శిని నియోగించామని ఆయన చెప్పారు.
హైకోర్టులో వర్గీకరణపై ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆ న్యాయవాది రాగానే న్యాయ సలహా తీసుకుంటారని ఆయన చెప్పారు. న్యాయసలహా అనంతరం అఖిల పక్ష బృందం ఢిల్లీకి వచ్చి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను, యుపి ఎ చైర్పర్సన్ సోనియా గాంధీని, కేంద్ర న్యాయశాఖా మంత్రిని కలుస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే శాసనసభ్యులు కొందరు ఢిల్లీకి వచ్చి సుప్రీంకోర్టు న్యాయవాదుల సలహాలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.