ఒక నక్సలైట్ హతం: మరొకరు లొంగుబాటు
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా తలకొండ మండలం సింగాయపల్లి వద్ద పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మరణించాడు. మరణించిన నక్సలైట్ను మావోయిస్టు మిడ్జిల్ దళ కమాండర్ కుప్పు వెంకటస్వామి అలియాస్ ప్రకాశ్గా గుర్తించారు. తలకొండపల్లి ఎమ్మార్వో కార్యాలయం పేల్చివేతలో, బాలానగర్లో జరిని కానిస్టేబుల్ హత్య కేసులో ప్రకాశ్ నిందితుడని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి ఒక 9 ఎం. ఎం. పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా వుంటే, నల్లగొండ జిల్లాలో మావోయిస్టు కృష్ణపట్టి దళం డిప్యూటీ కమాండర్ సింగం ఎల్లమ్మ అలియాస్ శోభ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) భగవత్ ముందు లొంగిపోయింది. మరో వైపు నలుగురు జనశక్తి నక్సలైట్లను నల్లగొండ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
మరో వైపు రెండు రోజుల క్రితం మావోయిస్టులు కిడ్నాప్ చేసిన మాజీ నక్సలైట్ లక్కయ్య మృతదేహం పోలీసుల కంట పడింది. ఇన్ఫార్మర్ అనే నెపంతో అతడ్ని మావోయిస్టులు కిడ్నాప్ చేసి హతమార్చినట్లు భావిస్తున్నారు.