ఐదో రోజు సమ్మె: జూనియర్లతో ప్రభుత్వం చర్చలు
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం సోమవారం సాయంత్రం చర్చలు ప్రారంభించింది. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చర్చలు జరుపుతున్నారు. జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె సోమవారంనాటికి ఐదో రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సోమవారం వినూత్న పద్దతిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్లో జూనియర్ డాక్లర్లు శిలువ మోస్తున్న క్రీస్తు వేషధారితో ర్యాలీ నిర్వహించారు. గుంటూరు పౌరాణిక పాత్ర వేషధారణతో ఆందోళనకారులు ద్రపర్శన నిర్వహించారు.
కర్నూలులో జూనియర్ డాక్టర్లు రాస్తారోకో నిర్వహించారు. విశాఖపట్నంలో జూనియర్ డాక్టర్లు కింగ్ జార్జి ఆస్పత్రి నుంచి రామకృష్ణా బీచ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైయస్ ఇచ్చిన హామీల పత్రాన్ని నీటిలో ముంచారు. విజయవాడలో జూనియర్ డాక్టర్లు వైయస్ శవయాత్ర నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు.