టిఆర్యస్ పోయినా ఫరవాలేదు, కానీ...: జానా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) పోయినా తాము జనశక్తి నేత రియాజ్ ఎన్కౌంటర్పై న్యాయవిచారణ జరిపించబోమని హోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు. రోగికి శస్త్రచికిత్స చేయడానికి వైద్యుడు కత్తిపట్టినట్లు సమాజానికి చికిత్స చేయడానికి నక్సలైట్లపై పోలీసులు ఆయుధాలు పడితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రియాజ్ ఎన్కౌంటర్పై న్యాయవిచారణ జరిపించాలని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులు రాజీనామా చేయడం ఒక డ్రామా అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోక్సభ సభ్యుడు జి. వెంకటస్వామి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది కాలంలో తెలంగాణ కోసం చేసిందేమిటో చెప్పాలని ఆయన టి ఆర్యస్ను డిమాండ్ చేశారు. తెలంగాణ శవంపై కాలు పెట్టి టి ఆర్యస్ నాయకులు పదవులు చేపట్టారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ సమీకరణలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమని, అది కాంగ్రెస్ మాత్రమే చేయగలుగుతుందని ఆయన అన్నారు. టి ఆర్యస్ను ప్రజలు పరీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు. 13 నెలలు పదవులు అనుభవించి త్యాగాలు చేశామనడం విడ్డూరమని ఆయన అన్నారు. టి ఆర్యస్ నాయకులకు పదవులు కావాలి, తెలంగాణ కాదని తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని ఆయన అన్నారు.
టి ఆర్యస్ మంత్రుల రాజీనామాలపై ఏమీ మాట్లాడనంటూనే క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణరావు అదిగో పులికథ వినిపించారు. తాను ఏది మాట్లాడినా వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు.
టి ఆర్యస్ మంత్రుల రాజీనామా ఒక హైడ్రామా అని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో పొత్తే కాంగ్రెస్, టి ఆర్యస్ల అవకాశవాదమని ఆయన సోమవారం విలేకరులతో అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులు రాజీనామాలు చేయడం మంచిదని విప్లవ రచయితల సంఘం (విరసం) అధ్యక్షుడు కళ్యాణరావు నెల్లూరులో అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించాలని ఆయన కోరారు.