వైయస్ గవర్నర్తో మాట్లాడి చక్కదిద్దుతారు: దిగ్విజయ్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గవర్నర్ సుశీల్కుమార్ షిండేతో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) మంత్రుల రాజీనామా వ్యవహారాన్ని చక్కదిద్దుతారని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవహారాలు, సంభవించబోయే పరిణామాలు తమ నాయకురాలు సోనియా గాంధీకి ముందే తెలుసునని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నిన్న మొన్నటి మంత్రివర్గ సమావేశంలో పాల్గొని ఇప్పుడు టి ఆర్యస్ మంత్రులు రాజీనామా చేయడం సరి కాదని ఆయన అన్నారు.
టి ఆర్యస్తో తమ స్నేహం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఏవైనా విభేదాలుంటే తాము చంద్రశేఖర్రావుతో మాట్లాడి పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు. తాము ఎన్నికల సమయంలో కలిసి పని చేశామని, కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. చంద్రశేఖర్రావు నిర్ణయం విచారకరమని, నిన్నటి సమావేశానికి తనను పిలిచి వుంటే సమస్య ఇంతదాకా వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. ఇదిలావుంటే, దిగ్విజయ్ సింగ్తో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్రావు సమావేశమయ్యారు.