ఆర్టీసి సమ్మె: ఎక్కడి బస్సులు అక్కడే
హైదరాబాద్: రాష్ట్ర రవాణా సంస్థ ( ఆర్టీసి) కార్మికుల సమ్మె ప్రభావం రాష్ట్రంలో తీవ్రంగా కనిపించింది. డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసి కార్మికులు ఆదివారం అర్థరాత్రి నుంచి తమ నిరవధిక సమ్మెను కొనసాగించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసి సమ్మెతో ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో హాజరు చాలా తక్కువగా కనిపించింది.
హైదరాబాద్లో ఆరు శాతానికి మించి బస్సులు నడవలేదని ఆర్టీసి వర్గాలు చెప్పాయి. తిరుమల కొండపైకి అలిపిరి నుంచి మూడు బస్సులు నడుపుతున్నారు. ఆర్టీసి సమ్మెతో తిరుమల కొండపై గల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్సులు లేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రయాణికులు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆర్టీసి సమ్మెను సాకుగా తీసుకొని ప్రైవేట్ బస్సులు ప్రయాణికులను దోచుకుంటున్నాయి.
ప్రభుత్వం హైదరాబాద్లో ఎం ఎంటియస్ రైళ్ల సంఖ్యను పెంచింది. అయితే దీని వల్ల పెద్దగా ఉపయోగం లేదని ప్రయాణికులు అంటున్నారు. ఆర్టీసి సమ్మెను నిరసిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీనిపై హైకోర్టు రేపు విచారణ జరుపుతుంది.