ఉద్యమాన్ని పదునెక్కించేందుకే..: టిఆర్యస్ మంత్రులు
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పదునెక్కించేందుకే తాము రాజీనామా చేశామని గవర్నర్కు రాజీనామా లేఖలు సమర్పించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) మంత్రులు అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విధానాలపై, వ్యాఖ్యలపై వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేయడం వల్ల తాము బంధవిముక్తి లభించనట్లయిందని పౌరసరఫరాల మంత్రి విజయరామారావు అన్నారు. బూటకపు ఎన్కౌంటర్లతో వైయస్ రాష్ట్రంలో రక్తపాతం సృష్టిస్తున్నారని టి ఆర్యస్ మంత్రులు విమర్శించారు. తెలంగాణ అంశాల పట్ల వైయస్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వారన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు వైయస్ విఘాతం కలిగిస్తున్నందుననే రాజీనామాలు చేశామని విజయరామారావు అన్నారు.
నక్సల్స్తో చర్చలు జరపాలని తాము నిరంతరంగా, నిర్విరామంగా తీర్మానాలు చేస్తూ వచ్చామని, చర్చలకు విఘాతం కలిగించి వైయస్ ప్రభుత్వం అనేక ఎన్కౌంటర్లతో కలవరపరుస్తోందని ఆయన అన్నారు. 610 జీవోను అమలు చేస్తామని హామీ ఇచ్చిన వైయస్ ఒక్క శాఖలో కూడా దాన్ని అమలు చేయలేదని ఆయన విమర్శించారు. 610 జీవోను అమలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో కోరాయని, దాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి కూడా పట్టించుకోలేదని ఆయన అన్నారు. టి ఆర్యస్ మంత్రులు దమ్ముంటే రాజీనామాలు చేయాలని క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణరావు అనడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. కుడిచేతితో రాజీనామా ఇచ్చి ఎడమ చేతితో వెనక్కి తీసుకున్న ఎం. సత్యనారాయణరావు లాగా తాము వ్యవహరించబోమని ఆయన అన్నారు.
వైయస్ తీరుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తమపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారని ఆయన అన్నారు. టి ఆర్యస్ మంత్రులతో మాట్లాడటం సమయం వృధా అని అనడం ద్వారా తమను కించపరిచారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్ట దెబ్బ తీనే విధంగా తాము ఎప్పుడూ మాట్లాడలేదని, అటువంటిది వైయస్ అలా వ్యాఖ్యానించడం తమను చాలా బాధ పెట్టిందని ఆయన అన్నారు. తమ ఉద్యమం తీవ్రతరం చేస్తామని, అవసరమైతే ప్రాణాలైనా ఇస్తామని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు తాము రాజీనామాలు చేశామని టి ఆర్యస్కు చెందిన మంత్రి ఎ. చంద్రశేఖర్ అన్నారు. కేబినెట్ మంత్రులను కించపరిచే విధంగా వైయస్ మాట్లాడారని, అందుకే తాము ముఖ్యమంత్రికి కాకుండా గవర్నర్కు రాజీనామా లేఖలు సమర్పించామని ఆయన అన్నారు. మంత్రివర్గం సమావేశాల్లో విధాన నిర్ణయాలపై ఎప్పుడూ చర్చలు జరగలేదని, పార్టీ కార్యాలయంలో విధాన నిర్ణయాలు తీసుకునేవారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. తమతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సీట్లు రావని అర్థం చేసుకున్న కోస్తా ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేశారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తమకు నమ్మకం ఉందని, సోనియా సమక్షంలో తెలంగాణ అంశం తేలుతుందని విజయరామారావు అన్నారు. తాము ఇక ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తామని అమెరికాలోని డెట్రాయిట్లో ఉన్న మరో టి ఆర్యస్ మంత్రి నాయని నర్సింహారెడ్డి ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. సంతోష్ రెడ్డి రాజీనామా చేయకపోతే ఆయన పార్టీ సభ్యతర్వం రద్దవుతుందని నర్సింహా రెడ్డి అన్నారు.
రాజీనామాలు సమర్పించిన అనంతరం టి ఆర్యస్ మంత్రులు నలుగురు తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా టి ఆర్యస్ కార్యకర్తలు సంతోష్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ద్రోహి సంతోష్ రెడ్డి అంటూ వారు నినాదాలు చేశారు. మంత్రులు నివారిస్తున్న వినకుండా వారు నినాదాలు చేశారు. ఇవే నినాదాలు టి ఆర్యస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా వినిపించారు.