5గురు టిఆర్యస్ మంత్రుల రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్)కి చెందిన ఐదుగురు రాష్ట్ర మంత్రులు సోమవారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను గవర్నర్ సుశీల్కుమర్ షిండేకు సమర్పించారు. హరీష్రావు, విజయరామారావు, చంద్రశేఖర్, లక్ష్మీకాంతరావులు తమ రాజీనామా లేఖలను నేరుగా గవర్నర్కు అందజేశారు. అమెరికాలోని డెట్రాయిట్లో వున్న రాష్ట్ర సాంకేతిక విద్యామంత్రి నాయని నర్సింహారెడ్డి తన రాజీనామా లేఖను పార్టీ ఫాక్స్లో పంపారు. తాను స్థానికంగా లేనందున తన రాజీనామాను ఫాక్స్లో పంపుతున్నట్లు ఆయన తెలిపారు. తమ శాసనసభ్యులతో ర్యాలీగా మం6తులు రాజీనామా లేఖలు సమర్పించడానికి రాజభవన్కు చేరుకున్నారు. రవాణా శాఖ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి తిరుగుబాటు ఎగురవేశారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వైఖరికి నిరసనగా, నక్సల్స్ ఎన్కౌంటర్లకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) మంత్రులు రాజీనామా చేశారు. నలుగురు రాష్ట్ర మంత్రులు విజయరామారావు, హరీష్రావు, లక్ష్మికాంతరావు, చంద్రశేఖర్ ఆదివారం ఢిల్లీలో కె. చంద్రశేఖర్రావుతో మాట్లాడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో మంత్రులు చంద్రశేఖర్రావుతో మాట్లాడుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి. టి ఆర్యస్ మంత్రులతో మాట్లాడటం సమయం వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో టిఆర్యస్ మంత్రులు మరింతగా ఆవేదనకు గురయ్యారు. వైయస్ వ్యాఖ్య క్యాబినెట్ మంత్రుల పట్ల చేసే వ్యాఖ్యలాగా లేదని, తమను కించపరిచే విధంగా ఉందని టి ఆర్యస్ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా అనంతరం చెప్పారు. అందుకే తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి కాకుండా గవర్నర్కు ఇచ్చామని ఆయన చెప్పారు.