అయోధ్యపై దాడి: మిలిటెంట్ల హతం, ఒకరి అరెస్టు
అయోధ్య: అయోధ్యలోని దేవాలయంపై తీవ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ భద్రతా వలయాన్ని ఛేదించి, బారికేడ్లను లంగించి అంబాసిడర్ కారులో అయోధ్యలోని వివాదస్పద స్థలం ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. భద్రతా బలగాలు ఆ కారును పట్టుకోగలిగారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు మిలిటెంట్లు కాల్పుల్లో హతమయ్యారు. పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెప్పారు. మిలిటెంట్లు దేవాలయానికి 150 మీటర్ల దూరం వరకు వచ్చారని, వివాదాస్పద స్థలంపై దాని ప్రభావం ఏమీ లేదని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం 9 గంటల 45 నిమిషాల ప్రాంతంలో జరిగింది. వివాదాస్పద స్థలంలోని సీతా రసోయి వద్ద తీవ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టి డ్రైవర్ను అరెస్టు చేశాయి. కాల్పుల్లో నలుగురు మరణించారు.
భద్రతా చర్యలు లోపభూయిష్టంగా ఉండడం వల్లనే తీవ్రవాదులు లోనికి ప్రవేశించగలిగారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్యస్యస్) అధికార ప్రతినిధి రామ్ మాధవ్ అన్నారు. ఈ దాడి అత్యంత దురదృష్టకరమని ఆయన సూరత్లో అన్నారు. హిందూ పవిత్ర ప్రాంగణాల్లోకి చాలా సులభంగా చొరబడి క్రూరమైన నేరాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఈ సంఘటనకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అయోధ్యపై మిలిటెంట్ల దాడికి బాధ్యత వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకోవాలని విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) నేత ప్రవీణ్ తొగాడియా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయోధ్యపై మిలిటెంట్ల దాడిని భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీవ్రంగా నిరసించింది. ఈ ఘటనకు నిరసనగా రేపు దేశవ్యాప్త ఆందోళన చేయనున్నట్లు బిజెపి అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ చెప్పారు.