హైకోర్టు సూచన: అయినా సమ్మె వైపే మొగ్గు
హైదరాబాద్: సమ్మెను విరమించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టీసి) కార్మిక సంఘాలకు సూచించింది. ప్రయాణికులను ఇబ్బంది పెట్టవద్దని, అందుకు సమ్మెను విరమించాలని హైకోర్టు చెప్పింది. ఆర్టీసి సమ్మెపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం ఆ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘాన్ని కోర్టు రద్దు చేసింది. విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సమస్యల పరిష్కారానికి ఐదుగురితో ఒక కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ప్రతినిధులు, ఇద్దరు కార్మికుల ప్రతినిధులు, ఒకరు న్యాయస్థానానికి చెందిన ప్రతినిధి ఉండాలని హైకోర్టు సూచించింది.
సమ్మె విరమించాలని హైకోర్టు చేసిన సూచనకు ఆర్టీసి కార్మిక సంఘాలు వ్యతిరేకంగా ప్రతిస్పందించాయి. ప్రస్తుతానికి సమ్మెను కొనసాగించాలనే ఆ సంఘాలు నిర్ణయించాయి. సమ్మె విరమించాలని హైకోర్టు సూచన చేసిన వెంటనే కార్మిక సంఘాలు అత్యవసరంగా సమావేశమై చర్చించాయి.
కాగా, ఆర్టీసి కార్మికుల సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ అవి ఎక్కడా కనిపించడం లేదు. నెల్లూరులో పోలీసుల రక్షణతో నడపడానికి ప్రయత్నించిన బస్సులను కార్మికులు అడ్డుకున్నారు. ఈ సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా 30 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని నిరసిస్తూ ప్రదర్శనకు దిగిన సిపిఐ నాయకులను, కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.