టిఆర్యస్ మంత్రులది అనైతికత: కాంగ్రెస్ మంత్రులు
హైదరాబాద్: రాజీనామాలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) మంత్రుల విమర్శలపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మంత్రులు తీవ్రంగా ధ్వజమెత్తారు. విధాన నిర్ణయాలు, తెలంగాణ అంశాలు మంత్రివర్గంలో చర్చకు రాలేదని టి ఆర్యస్ మంత్రులు చేసిన విమర్శను కాంగ్రెస్కు చెందిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, జె. గీతారెడ్డి తదితరులు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తిప్పికొట్టారు.
టి ఆర్యస్ మంత్రులు అనైతిక ఆరోపణలు చేశారని వారన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదనేది అబద్ధమని వారన్నారు. తెలంగాణ గురించి ఏనాడూ మంత్రివర్గంలో చర్చించలేదని వారన్నారు. మంత్రివర్గం సమావేశంలో టి ఆర్యస్ మంత్రులు ప్రస్తావించని విషయాలపై బయట మాట్లాడుతున్నారని వారన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో టి ఆర్యస్ చేస్తున్న విమర్శల్లో ఏ మాత్రం నిజం లేదని, దీన్ని బట్టే మిగతా అంశాల విషయంలో కూడా వారు మాట్లాడేది నిజం కాదని అర్థం చేసుకోవచ్చునని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిది అవకాశవాద రాజకీయమని మంత్రులు విమర్శించారు. పదవుల్లో ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు మరో రకంగా టిఆర్యస్ మంత్రులు మాట్లాడుతున్నారని వారన్నారు. కాంగ్రెస్ తెలంగాణపై రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉందని వారు చెప్పారు.