తెలంగాణపై 8న నివేదిక, వెంటనే యుపిఎ ప్రకటన
న్యూఢిల్లీ: తెలంగాణపై ఏర్పాటయిన ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని త్రిసభ్య ఉపసంఘం ఈ నెల 8వ తేదీన సమావేశమై తన నివేదికను సమర్పిస్తుందని, ఆ నివేదిక అందిన వెంటనే ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ఒక అధికారిక ప్రకటన చేస్తుందని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. దిగ్విజయ్ సింగ్ మంగళవారంనాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) అధినేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్రావు నివాసానికి వచ్చారు. ఇరువురి మధ్య దాదాపు గంటన్నర సేపు సమావేశం జరిగింది.
రాష్ట్రంలో తిరిగి మంత్రివర్గంలో చేరాలని తాను కెసిఆర్ను కోరినట్లు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణకు సంబంధించిన అంశాల జాబితాను రేపు కెసిఆర్ తనకు అందిస్తారని, విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి తాను ఆ జాబితాను అందిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణకు సంబంధించి కెసిఆర్ ఇచ్చిన అంశాలు అమలు జరిగేలా తాము చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కెసిఆర్, రాజశేఖర్ రెడ్డిల మధ్య ఈ నెల 14, 21 తేదీల మధ్య సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు.
సమస్య సమసిపోయినట్లేనా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్రావు సూటిగా సమాధానం చెప్పలేదు. దిగ్విజయ్సింగ్పై తనకు గౌరవం ఉన్నదని, దిగ్విజయ్ సింగ్ అన్నీ అర్థం చేసుకోగలరని ఆయన అన్నారు. దిగ్విజయ్ సింగ్ తమకు అన్యాయం చేయబోరని, దిగ్విజయ్ చెప్పినట్లు వినడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
చంద్రశేఖర్రావు మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వైఖరిపై, తెలంగాణ ఏర్పాటు అంశంలో ప్రణబ్ ముఖర్జీ నివేదిక సమర్పణ విషయంపై ఆయన సోనియాతో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
ఇదిలావుంటే, మంత్రి పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించిన ఎస్. సంతోష్ రెడ్డితో పాటు మిగతా టిఆర్యస్ మంత్రులు ఢిల్లీకి చేరుకున్న వెంటనే తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు మధుసూదన్ రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం వారు చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. తెలంగాణకు మద్దతు తెలియజేస్తూ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డిఎ) కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్ జనతాదళ్ (యు) తరఫున ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఒక లేఖ రాశారు. తెలంగాణపై వైఖరిని తెలియజేయాల్సిందిగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ మరోసారి భారతీయ జనతా పార్టీ (బిజెపికి)కి లేఖ రాసింది.