ఆర్టీసి చర్చలు: 11వ తేదీకి వాయిదా
హైదరాబాద్: ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులకు, మంత్రివర్గ ఉపసంఘానికి మధ్య జరుగుతున్న చర్చలు ఈ నెల 11వ తేదీకి వాయిదా పడ్డాయి. సమ్మెను విరమించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులను గురువారం ఉదయం చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చల్లో సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన విధానంపై ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరినట్లు రవాణా శాఖ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి చెప్పారు. చర్చలు శాంతియుతంగా, సుహృద్భావ వాతావరణంలో జరుగుతాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
కార్మిక సంఘాల నేతలకు, మంత్రి వర్గ ఉపసంఘానికి మధ్య తిరిగి 11, 12, 13 తేదీల్లో చర్చలు జరుగుతాయి. కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకుంటామని మంత్రి చెప్పారు. తాము ఇప్పటికే అంగీకరించిన డిమాండ్లను వెంటనే అమలు చేస్తామని, సమ్మెకు దిగిన కార్మికులపై క్రమశిక్షణా చర్యలు ఉండవని ఆయన చెప్పారు. చర్చల ద్వారా ఆర్టీసి పరిరక్షణకు, కార్మికుల సంక్షేమానికి, ప్రయాణికుల సౌకర్యం కోసం అనుసరించాల్సిన మార్గాలను కనుక్కుంటామని ఆయన చెప్పారు. హైకోర్టు సూచన నేపథ్యంలో తమ సమ్మెను 21 రోజుల పాటు వాయిదా వేసుకుంటున్నట్లు కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో గురువారం రాష్ట్రంలో మళ్లీ ఆర్టీసి బస్సులు పరుగులు తీశాయి.