జనశక్తి నక్సల్స్ బంద్కు పాక్షిక స్పందన
హైదరాబాద్: తమ నేత రియాజ్ ఎన్కౌంటర్కు నిరసనగా జనశక్తి నక్సలైట్లు ఇచ్చిన రాష్ట్ర బంద్కు మిశ్రమ స్పందన లభించింది. నక్సలైట్ల ప్రభావం ఉన్న మారుమూల ప్రాంతాలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. చాలా ప్రాంతాల్లో వాణిజ్య వ్యాపార సంస్థలు, విద్యాలయాలు తెరిచే ఉన్నాయి. బంద్ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలూ జరగలేదు. రెండు, మూడు జిల్లాల్లో మాత్రమే నక్సల్స్ బంద్ ప్రభావం కొద్దిగా కనిపించింది.
నిజామాబాద్ జిల్లాలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. కరీంనగర్ జిల్లాల్లో సమస్యాత్మక గ్రామాలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలకు బస్సు సర్వీసులు రద్దయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాల్లో పాక్షిక ప్రభావం కనిపించింది. కొల్లాపూర్, తదితర ప్రాంతాల్లో బంద్ ప్రభావం కొద్దిగా కనిపించింది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉన్నాయి. జనశక్తి బంద్కు మావోయిస్టులు కూడా మద్దతు తెలియజేశారు. అనంతపురం జిల్లాలో కూడా పెద్దగా బంద్ ప్రభావం కనిపించలేదు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, మరి కొద్ది ప్రాంతాల్లో బంద్ కాస్తా ప్రభావం చూపింది. రియాజ్ సొంత ప్రాంతమైన కావలి ఏరియాలో కూడా బంద్ ప్రభావం అంతంత మాత్రమే. గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు బస్సులను రద్దు చేశారు.