కెసిఆర్ అసమర్థుడు, చేసింది సున్నా: టిడిపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) నాయకుడు, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు అసమర్థుడని తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్. వేణుగోపాలాచారి, మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. ఏకాభిప్రాయం సాధిస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని యుపిఎ ఉపసంఘం చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ తేల్చేశారని, దీన్ని బట్టి చంద్రశేఖర్ రావు సాధించిందేమీ లేదని అర్థమవుతోందని వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 14 నెలలుగా ప్రభుత్వంలో కొనసాగి కూడా చంద్రశేఖర్ రావు యుపి ఎలోనే ఏకాభిప్రాయం సాధించలేకపోయారని వారన్నారు.
కేంద్రంలో తాను మాత్రం పదవిలో కొనసాగుతూ రాష్ట్రంలో తమ పార్టీ మంత్రుల చేత రాజీనామాలు చేయించడాన్ని వారు అవహేళన చేశారు. ఒక మంత్రి చంద్రశేఖర్ రావు మాట కూడా వినని స్థితి వచ్చిందని వారన్నారు. చంద్రశేఖర్ రావు గత 13 నెలల్లో తెలంగాణకు చేసిందేమీ లేదని, ఏదో చేస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారని వారు విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి వెంటనే కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకోవాలని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) డిమాండ్ చేసింది. మరికొంత కాలయాపన చేయడానికే సబ్ కమిటీ సమావేశాలంటూ హడావిడి చేస్తున్నారని టఫ్ నాయకులు శుక్రవారం మరో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.