బాబ్లీకి బ్రేక్: వైయస్ ప్రభుత్వానికి ఊరట
న్యూఢిల్లీ: గోదావరి నదిపై చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపేయాలని కేంద్ర జలసంఘం (సిడబ్ల్యుసి) మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర అక్రమంగా నిర్మిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసింది. కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయకుండా మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడంపై సిడబ్ల్యుసి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారంనాడు ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిడబ్ల్యుసి ఆ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్కు ఊరట లభించింది.
గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా 11 సాగునీటి ప్రాజెక్టులు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ అఖిల పక్ష నాయకులు కూడా ఈ విషయమై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అనంతరం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కేంద్ర మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీకి మహారాష్ట్ర విషయాన్ని తెలియజేశారు. ఈ విషయంపై రెండు రాష్ట్రాల అధికారుల సమావేశం ఏర్పాటు చేస్తానని, అవసరమైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేస్తానని ప్రియరంజన్ దాస్ మున్షీ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు సోమవారం ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశాన్ని నిర్వహించారు.