జూనియర్ డాక్టర్లకు కోర్టు ధిక్కార నోటీసులు
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. తమ మాట ఖాతరు చేయని జూనియర్ డాక్టర్లపై కోర్టు ధిక్కారం కింద కేసులు పెట్టాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో జూనియర్ డాక్టర్లకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. జూనియర్ డాక్టర్ల చేత హాస్టళ్లను కూడా ఖాళీ చేయిస్తామని, ఆస్పత్రులకు వారిని రానివ్వమని, ఇదంతా కోర్టు సూచన మేరకే చేస్తున్నామని వైద్య , ఆరోగ్య ముఖ్య కార్యదర్శి ఐ.వి. సుబ్బారావు చెప్పారు.
సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై హైకోర్టు సోమవారం కొరడా ఝళిపించింది. జూనియర్ డాక్టర్లపై కోర్టు ధిక్కారం కింద కేసు దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి ఈ రోజు వరకు గడువు ఉన్నప్పటికీ దాని కన్నా ముందే సమ్మెను ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని హైకోర్టు జూనియర్ డాక్టర్లను ఆదేశించింది.
జూనియర్ డాక్టర్ల వివరణ కోసం కొద్ది సమయం ఇచ్చిన హైకోర్టు విచారణను మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు వాయిదా వేసింది. జూనియర్ డాక్టర్ల రిజిస్ట్రేషన్ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని హైకోర్టు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (యంసిఐ)ని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె వల్ల నలుగురు రోగులు మరణించారంటూ, దానికి బాధ్యులెవరని హైకోర్టు ప్రశ్నించింది.
హైకోర్టు ఆదేశించినప్పటికీ సమ్మెను విరమించడానికి జూనియర్ డాక్టర్లు నిరాకరించారు. ఆస్పత్రులకు దూరంగానే ఆందోళనను కొనసాగించాలని హైకోర్టు జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. రిటైర్డ్ వైద్యులతో రోగులకు చికిత్స అందించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.