మంత్రుల గైర్హాజరు: ఆర్టీసి చర్చలు వాయిదా
హైదరాబాద్: ఆర్టీసి చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు రాకపోవడంతో చర్చలు జరగలేదు. మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులైన రవాణా శాఖ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు చర్చలకు గైర్హాజరయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కొణతాల రామకృష్ఖ ఒక్కరే వచ్చారు. తన ఆరోగ్యం బాగా లేనందున తాను రాలేకపోతున్నట్లు సంతోష్ రెడ్డి తెలియజేశారు.
సమ్మెను విరమించి విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆర్టీసి కార్మికులు సమ్మెను వాయిదా వేశారు. 21 రోజులు ప్రభుత్వానికి గడువు ఇస్తూ కార్మికులు సమ్మె విరమించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు ఈ నెల 11, 12, 13 తేదీలను ఇరుపక్షాలు ఖరారు చేసుకున్నాయి. ఈ తేదీల్లో మొదటి రోజు చర్చలు వాయిదా పడ్డాయి. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు.