జార్జి తన పరిధి అతిక్రమిస్తున్నారు: బిజెపి
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్యస్యస్)పై జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డీ ఎ) కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీవ్రంగా మండిపడింది. ఆర్యస్యస్పై విమర్శలు చేయడం ద్వారా ఫెర్నాండెజ్ తన పరిధిని అతిక్రమించారని బిజెపి అధికార ప్రతినిధి సుష్మా స్వరాజ్ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఫెర్నాండెజ్ చర్య తమను తీవ్రంగా బాధపెట్టిందని ఆమె అన్నారు.
యన్డీ ఎ అనేక పార్టీల కూటమి అని, ఏ పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీవని, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోవడం పద్ధతి కాదని, తమ తమ పార్టీ నేతలను ఎన్నుకునే హక్కు ఆయా పార్టీలకు ఉందని ఆమె అన్నారు. బిజెపి ఆర్యస్యస్ నుంచి స్ఫూర్తి పొందిందని, తమకు ఆర్యస్యస్ నేతలే స్ఫూర్తి అని ఆమె అన్నారు. ఆర్యస్యస్ పట్ల తమ నిబద్ధత ఎప్పుడూ మారదని ఆమె అన్నారు. ఫెర్నాండెజ్ తమ మనోభావాలను గౌరవించాలని ఆమె అన్నారు. ఆర్యస్యస్ రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆమె ఫెర్నాండెజ్కు సూచించారు.