ఆర్టీసి చర్చలు ఈ నెల 20కి వాయిదా
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితికి మధ్య జరుగుతున్న చర్చలు తిరిగి వాయిదా పడ్డాయి. ఈ చర్చలు మళ్లీ ఈ నెల 20వ తేదీన జరుగుతాయి. కార్మికులకు చెల్లించాల్సిన మధ్యంతర భృతి విషయంలో ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. చర్చలు సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని, చర్చలు ఫలప్రదం అవుతాయని రవాణా శాఖ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి చెప్పారు. చర్చల గురించి సంతోష్ రెడ్డి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కలిసి ఆయనకు వివరించారు.
అయితే చర్చల తీరు పట్ల ఐక్య కార్యాచరణ సమితి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చర్చల తీరు ఆశాజనకంగా లేదని, ప్రభుత్వ చర్చలను సాగదీస్తోందని వారన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెకు దిగుతామని వారన్నారు. హైకోర్టు సూచన మేరకు ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరారు. వారి సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ఐక్య కార్యాచరణ సమితి నాయకులతో ఈ నెల 11వ తేదీ నుంచి చర్చలో జరుపుతోంది. అయితే మంత్రి వర్గ ఉపసంఘంలోని ఇద్దరు మంత్రులు గైర్హాజరు కావడంతో మధ్యలో ఒక రోజు చర్చలు జరగలేదు.