సంతోష్ రెడ్డి రాజీనామా: అయినా వైయస్ పాటే!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్)కి చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి అందజేశారు. తద్వారా తమ పార్టీ అగ్రనాయకత్వానికి ఇచ్చిన మాటను సంతోష్ రెడ్డి నిలబెట్టుకున్నారు. అయినా ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ఆయన కితాబు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన తన రాజీనామా సమర్పణ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ప్రత్యేక పరిస్థితుల్లోనే తాను రాజీనామా చేశానని సంతోష్ రెడ్డి చెప్పారు. తాను ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. తన సహచర మంత్రులు ఐదుగురితో పాటు రాజీనామా చేయడానికి సంతోష్ రెడ్డి మొదట నిరాకరించారు. కేంద్ర మంత్రి పదవులకు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్రలు కూడా రాజీనామా చేయాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. అయితే ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి చంద్రశేఖర్ రావుతో చర్చించిన అనంతరం రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి రాగానే తాను రాజీనామా చేస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆ మేరకు ఆయన బుధవారం రాజీనామా చేశారు.