వోక్స్ వ్యాగన్ స్కామ్లో వైయస్కూ పాత్ర: బాబు
హైదరాబాద్: లెక్కా పత్రం లేకుండా వోక్స్ వ్యాగన్ పేరు మీద వశిష్ట వాహన్కు రూ. 11 కోట్ల చెల్లింపు కుంభకోణంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి సంబంధం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్య బ్లాక్మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయని, అందుకే వోక్స్ వ్యాగన్ కుంభకోణానికి ప్రధాన బాధ్యుడైన భారీ పరిశ్రమల మంత్రి బొత్సా సత్యనారాయణపై చర్య తీసుకోవడం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మంత్రి బొత్సా సత్యనారాయణను వెంటనే డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
11 కోట్ల రూపాయల చెల్లింపు విషయం మీదనే కాకుండా అన్ని వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వోక్స్ వ్యాగన్ పేరుతో బినామీ పేర్ల మీద భూములు కొనుగోలు చేసిన వ్యవహారంపై కూడా విచారణ జరిపించాలని ఆయన డిమండ్ చేశారు. వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో ఎవరెవరు పాత్రధారులు, వశిష్ట వాహన్ కంపెనీ స్థాపన వెనుక ఉన్నదెవరు అనే అంశాలపై విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పత్రాలు, తనిఖీలు లేకుండా, వోక్స్ వ్యాగన్ స్థలం ఏదో తేలకుండా 11 కోట్ల రూపాయలు ఎలా చెల్లించారని ఆయన ప్రశ్నించారు.