వోక్స్ వ్యాగన్ స్కామ్పై ప్రతిపక్షాల ధ్వజం
హైదరాబాద్: వోక్స్ వ్యాగన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తాయి. వోక్స వ్యాగన్ పేర వశిష్ట వాహన్కు 11కోట్ల రూపాయల చెల్లింపునకు సంబంధించి అన్ని వ్యవహారాల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ప్రత్యక్ష సంబంధం ఉందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి అనుమతితోనే ఇదంతా జరిగిందని అధికారులు, మంత్రులు చెబుతున్నారని, ఇదే ముఖ్యమంత్రి పాత్రను తెలియజేస్తోందని ఆయన అన్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రికి తెలియకపోతే ఎవరికి తెలుస్తుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి సంతకం, ఆర్థిక మంత్రి సంతకం లేకుండానే చెల్లింపులు ఎలా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి అంతటికీ ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సిందేనని ఆయన అన్నారు.
భారీ పరిశ్రమల మంత్రి బొత్సా సత్యనారాయణ శాఖ మారిస్తే సరిపోదని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. కుంభకోణం బయటపడగానే వోక్స్ వ్యాగన్ డైరెక్లరందరూ రాజీనామాలు చేశారని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సిపిఐ విచారణ పరిధిలోకి పలు విషయాలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సిబిఐ దర్యాప్తును కోరాలనుకోవడం సరైందని ఆయన అన్నారు.
అధికారులు మంత్రిని తప్పుదోవ పట్టించారా, మంత్రి అధికారులు తప్పుదోవ పట్టించారా అనే విషయాలపై వాస్తవాలు వెల్లడించాలని సిపియం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందుచూపు లేకుండా వశిష్ట వాహన్కు 11 కోట్ల రూపాయలు ఎలా చెల్లించారని ఆయన ప్రశ్నించారు. మొదట డబ్బుల చెల్లింపును అధికారులు ఆపేస్తే తర్వాత ఎందుకు చెల్లించారని ఆయన అడిగారు. కుంభకోణాల విషయంలో ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.
అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి వోక్స్ వ్యాగన్ వ్యవహారంపై వాస్తవాలు వెల్లడించాలని సిపియం రాజ్యసభ సభ్యుడు మధు మరో విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వశిష్ట వాహన్ గురించి తనకు తెలియదని బొత్సా సత్యనారాయణ అనడం విడ్డూరమని ఆయన అన్నారు.