కేంద్రంపై పోరు: నేదురమల్లి నిరసనగళం
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం తీరు వల్ల ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరుగుతోందని, ఈ అన్యాయాన్ని నిరోధించడానికి కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం షిప్యార్డులో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి బాలు, ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డితో పాటు పాల్గొన్న జనార్దన్ రెడ్డి కేంద్రంపై, ముఖ్యమంత్రిపై నిరసన గళం వినిపించడం గమనార్హం.
కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడులే ఉపయోగపడ్డాయని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేయి కోట్ల రూపాయల జాతీయ రహదారుల అభివృద్ధి నిధులు ఎక్కువగా తమిళనాడుకే తరలిపోతున్నాయని ఆయన అన్నారు. మరో ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్కు రాకుండా పోయిందని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పోరాట పటిమ కనబరిచారని, ఇప్పుడు వైయస్లో ఆ పటిమల లేదని ఆయన అన్నారు.