శ్రీలక్ష్మి హత్య కేసు: మనోహర్కు ఉరిశిక్ష
విజయవాడ: ఎంసిఎ విద్యార్థిని శ్రీలక్ష్మి హత్య కేసులో మనోహర్ అనే యువకుడికి ఉరిశిక్ష విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. న్యాయమూర్తి 25 పేజీల తీర్పును వెలువరించారు. ఈ ఉరిశిక్షను హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంది. హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా న్యాయమూర్తి మనోహర్కు ఇచ్చారు. శ్రీలక్ష్మి హత్య క్షణికావేశంలో జరిగింది కాదని, ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే మనోహర్ శ్రీలక్ష్మిని హత్య చేశాడని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
మనోహర్ బతకడానికి అనర్హుడని, అందుకే ఉరిశిక్ష విధించామని న్యాయమూర్తి తన తీర్పులో అన్నారు. మనోహర్ మానసిక స్థితి బాగానే ఉందని ప్రత్యేక వైద్యనిపుణుల బృందం నివేదిక తెలియజేస్తోందని స్పష్టం చేశారు. మహిళా, విద్యార్థి సంఘాల ఆందోళన తీర్పు ప్రభావం చూపలేదని ఆయన అన్నారు. విద్యాసంస్థలు అడ్మిషన్లు ఇచ్చే ముందు విద్యార్థుల గత చరిత్రను పరిశీలించలాని న్యాయమూర్తి సూచించారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని డిఫెన్స్ న్యాయవాది చెప్పారు. తీర్పు వెలువరించగానే ప్రేక్షకులు చప్పట్లు కొట్టడాన్ని అనుమతించడాన్ని డిఫెన్స్ న్యాయవాది తప్పు పట్టారు. విచారణ జరుగుతుండగా మహిళా సంఘాలు కోర్టు బయట ఆందోళనలను చేపట్టడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. తీర్పు అనంతరం మనోహర్ను రాజమండ్రి జైలుకు పంపించారు.
శ్రీలక్ష్మి అనే విద్యార్థిని హత్య కేసులో మనోహర్ అనే యువకుడి నేరం రుజువైనట్లు మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చలపతిరావు ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. మనోహర్ మేనత్త, పిన్నిలు ఉమామహేశ్వరి, వరమ్మలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించారు. ఈ కేసులో తుది తీర్పును న్యాయమూర్తి ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. తనను ప్రేమించలేదనే కోపంతో మనోహర్ శ్రీలక్ష్మిని విజయవాడలో కళాశాలలోనే దారుణంగా హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కున్నాడు. మనోహర్ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు పెద్ద యెత్తున ఆందోళన చేపట్టాయి. శ్రీలక్ష్మిని హత్య చేయడానికి మనోహర్కు అతని మేనత్త, పిన్నిలు సహకరించారని కేసు నమోదైంది.
నేరం రుజువైనట్లు ప్రకటించిన అనంతరం న్యాయమూర్తి చలపతిరావు ఏమైనా చెప్పుకోవాల్సి ఉందా? అని మనోహర్ను ప్రశ్నించారు. ఏమీ లేదని మనోహర్ చెప్పాడు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ మనోహర్కు ఉరిశిక్ష వేయాలని వాదించారు. భారతదేశంలో ఉరిశిక్షను రద్దు చేయలేదు కాబట్టి మనోహర్కు ఉరిశిక్ష వేయడమే న్యాయమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఉరిశిక్ష కూడదని మనోహర్ తరఫు న్యాయవాది చెప్పుకున్నారు.