వెంకయ్యకు మరోసారి బిజెపి పగ్గాలు?
చెన్నై: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎం. వెంకయ్యనాయుడు తిరిగి భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలున్నాయి. బిజెపి సీనీయర్ నేత జస్వంత్ సింగ్ ఆదివారం చెన్నైలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ సంకేతాలు ఇచ్చారు. ఒకసారి పదవికి రాజీనామా చేసినంత మాత్రాన అక్కడే ఆగిపోతారని ఏమీ లేదని ఆయన వెంకయ్య నాయుడిని ఉద్దేశించి అన్నారు. గతంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వెంకయ్యనాయుడు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయాయని ఆయన అన్నారు.
పార్టీ యావత్తూ తమ నేత ఎల్.కె. అద్వానీ వెంట ఉన్నదని, అద్వానీ తీసుకునే నిర్ణయాన్ని పార్టీ సమర్థిస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తుపై తాము విశ్వాసంతో ఉన్నామని ఆయన చెప్పారు. డిసెంబర్లో రాజీనామా చేయాలని అద్వానీ స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నారని, దీనిపై ఎవరి ఒత్తిడి లేదని బిజెపి ప్రతినిధి నక్వీ అన్నారు. ముంబాయిలో డిసెంబర్లో జరిగే సమావేశంలోగా కొత్త నాయకుడి ఎంపిక జరుగుతుందని శతృఘ్న సిన్హా చెప్పారు.