వాగులో చిక్కిన బస్సు: ముగ్గురు గల్లంతు
హైదరాబాద్: వరంగల్ జిల్లాను కూడా వరద తాకిడి కుదిపేస్తోంది. వరంగల్ జిల్లా రఘునాథపల్లి గ్రామ సమీపంలో ఒక బస్సు వాగులో చిక్కుకుంది. ఈ బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు గల్లంతయ్యారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ జాతీయ రహదారికి గండి పడింది. ఇదిలావుంటే, వరంగల్ జిల్లాలోని బానోజి పేట వద్ద ఒక ఆటో వరదలో చిక్కుకుంది. దీనిలోని తల్లీకూతుళ్లు గల్లంతయ్యారు.
మంగళవారంనాటి భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా విపరీతంగా దెబ్బ తిన్నది. ఈ జిల్లాలో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. కొత్తగూడెంలోని బృందావన్ కాలనీలో ఇళ్లు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. కొండ చరియలు విరిగి పడుతున్నాయి.
గోదావరి నది ఉప్పొంగుతోంది. ధవళేశ్వరం వద్ద చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విజయవాడలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి.