నక్సల్స్తో తెరాస లింక్పై చర్చించలేదు: డిజిపి
హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు మావోయిస్టులతో సంబంధాల విషయంపై చర్చ జరగలేదని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ స్పష్టం చేశారు. తెరాసతో మావోయిస్టులకు సంబంధాలున్నాయని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారనే పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో డిజిపి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ వివరణ ఇచ్చారు.
నక్సల్స్ అణచివేతకు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకు సంబంధించి రెండు జాయింట్ కమాండ్లు ఏర్పాటవుతాయని, మొదటి కమాండ్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. ఈ జాయింట్ కమాండ్కు ఆంధ్రప్రదేశ్ డిజిపి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని, ఒక్కో రాష్ట్రం ఐజి స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమిస్తుందని ఆయన చెప్పారు. నక్సల్స్ అణచివేతకు హెలికాప్టర్లు వాడడంతో పాటు ఇస్రో సహకారం తీసుకుంటామని ఆయన చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి ఉపయోగపడుతున్నారనే ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. పోలింగ్ బూత్ల వద్ద పోలీసులు మాజీ నక్సలైట్లను ఉపయోగించుకోవడంలో తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెరాస నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్రపై హైదరాబాద్లో వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. కోబ్రాలను పట్టుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు.