మీడియావన్నీ అబద్ధం వార్తలే: జానారెడ్డి
హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మాట్లాడినట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. పత్రికలు అబద్ధపు వార్తలు రాశాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ ముఖ్యమంత్రి పవర్ ప్రజెంటేషన్ చేసినట్లు వార్తలు పూర్తిగా అవాస్తవాలని ఆయన అన్నారు.
పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏ ఒక్కటి కూడా వాస్తవం లేదని, పూర్తిగా వక్రీకరణలేనని ఆయన అన్నారు. మీడియా అపోహలు కలిగించే విధంగా, ఆపాదిస్తూ వార్తలు రాయడం విచారకరమని ఆయన అన్నారు. ప్రత్యక్షంగా చూసి, తెలుసుకుని రాస్తే తమకు అభ్యంతరం లేదని, అలా కాకుండా అక్కడ ఉండి చూసినట్లు వార్తలు రాశారని ఆయన అన్నారు. కొంచెం అటూ ఇటుగా వక్రీకరించడం, జోడించడం మామూలేనని, అయితే ఇంత వక్రీకరణ ఇంతవరకు తాను చూడలేదని ఆయన అన్నారు. తాము ప్రత్యక్ష సాక్షులం కాబట్టి అబద్ధాలను ఖండించాల్సి వస్తోందని ఆయన అన్నారు.