కాంగ్రెస్విజయభేరి,టిఆర్ఎస్ కారుకు పంక్చర్
విజయవాడ/హైదరాబాద్: కాంగ్రెస్ అధికార దుర్వియోగానికి పాల్పడి మున్పిపల్ ఎన్నికల్లో విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని ఆయన సోమవారం విజయవాడలో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఏ కారణాల వల్ల, ఏ లోపాల వల్ల ఈ ఫలితాలు వచ్చాయనేది విశ్లేషించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తమకు ప్రజాస్పందన విరివిగా లభించిందని, ఆయినా ఓడిపోయామని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్ యంత్రాల వాడకాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రపంచంలో ఎక్కడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడడం లేదని ఆయన అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుండాయిజం, డబ్బు పంపిణీలతో గెలిచిందని తెలుగుదేశం నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని అన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)నే కనుమరగైందని ఆయన అన్నారు. స్థానిక శాసనసభ్యులకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మంత్రి పదవులు ఎర వేశారని, దానితో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ శాసనసభ్యులు పనిచేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు.