త్వరలో మంత్రివర్గ విస్తరణ: ముఖ్యమంత్రి
హైదరాబాద్: త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. మున్సిపల్ ఎన్నికల విజయం సాధించినందుకు శాసనసభ్యులకు ఏమైనా ఇస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆయన జవాబిచ్చారు.
తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా కొంత సంయమనం పాటించడం అవసరమని ఆయన సూచించారు. తాము హిపోక్రాట్లం కాదని, చెప్పింది చేస్తున్నామని ఆయన అన్నారు. ఉన్నదానికి లేనిదానికి విమర్శలు చేస్తే ప్రజలు విశ్వసించబోరని, తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారానికి మద్దతు ఇస్తే ప్రజలు నమ్మబోరని తెలుగుదేశం పార్టీ, మీడియాలోని ఒక సెక్షన్ గమనించడం అవసరమని ఆయన అన్నారు.
వరద తాకిడి ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం వచ్చిందని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవడానికి సంపూర్ణ సహకారం అందించాలని తమ పార్టీ నేత సోనియా గాంధీని కోరుతామని ఆయన చెప్పారు.