కలిసి పనిచేయండి: సర్ది చెప్పిన బిసిసిఐ
ముంబాయి: భారత క్రికెట్ జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్, కెప్టెన్ సౌరవ్ గంగూలీల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి ఏర్పాటయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సమీక్షా సమావేశం ముగిసింది. భారత క్రికెట్ జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్, కెప్టెన్ సౌరవ్ గంగూలీల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి మంగళవారం ముంబాయిలో బిసిసిఐ సమీక్షా సమావేశం జరిగింది. గంగూలీపై ఫిర్యాదు చేస్తూ చాపెల్ బిసిసిఐ అధ్యక్షుడు రణబీర్ సింగ్ మహేంద్రకు పంపిన ఇ - మెయిల్ లీక్ కావడంతో పెద్ద యెత్తున దుమారం చెలరేగింది.
గంగూలీకే బిసిసిఐ అండగా నిలిచింది. చాపెల్, గంగూలీ కలిసి పనిచేయాలని బిసిసిఐ సూచించింది. గంగూలీపై చాపెల్ చేసిన ఆరోపణలు నిరాధారమని బిసిసిఐ కొట్టిపారేసింది. మీడియాతో మాట్లాడవద్దని బిసిసిఐ చాపెల్కు, గంగూలీకి, ఆటగాళ్లకు సూచించింది. సమాచార లోపం వల్లనే సమస్య జటిలమైందని బిసిసిఐ అభిప్రాయపడింది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, బోర్డుదే తుది నిర్ణయమని బిసిసిఐ స్ఫష్టం చేసింది. కోచ్, కెప్టెన్, ప్లేయర్లకు ఎవరికైనా ప్రదర్శనే గీటురాయి అని స్పష్టం చేసింది. గంగూలీ గాయాల పాలైన మాట వాస్తవమేనని, చాపెల్ ఆరోపణ నిజం కాదని బిసిసిఐ స్పష్టం చేసింది.
బిసిసిఐ సమీక్ష కమిటీ సభ్యులు మొదట చాపెల్తో, ఆ తర్వాత గంగూలీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇద్దరిని కలిపి మాట్లాడారు.