వరద బాధితులను ఆదుకుంటాం: సోనియా
విజయవాడ: రాష్ట్రంలోని వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) చైర్ పర్సన్ సోనియా గాంధీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని వరద తాకిడి ప్రాంతాల పర్యటన కోసం ఆమె మంగళవారంనాడు రాష్ట్రానికి వచ్చారు. ఆమె ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఆమె వెంట కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి వనబాక లక్ష్మి ఉన్నారు. గన్నవరం విమానాశ్రయంలో సోనియాకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు తదితరులు స్వాగతం చెప్పారు.
గన్నవరం విమానాశ్రయంలో వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆమె తిలకించారు. వరద తాకిడి ప్రాంతాల్లో ప్రభుత్వం అందించిన సహాయం గురించి కేశవరావు, తదితరులు సోనియాకు వివరించారు. అనంతరం ఆమె పశ్చిమ గోదావరి జిల్లా పోలవరానికి సమీపంలో గల ప్రగడవరానికి హెలికాప్టర్లో చేరుకున్నారు. కృష్ణా జిల్లా కంచలిలో, విజయవాడలో ఆమె వరద బాధితులను పరామర్శించారు. సోనియా పర్యటన కవరేజీకి ఎక్కడ కూడా మీడియాను అనుమతించలేదు.