మీడియాకు కాంగ్రెస్ ఎమ్యెల్యే క్షమాపణలు
హైదరాబాద్/నెల్లూరు: మీడియాకు కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి క్షమాపణ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నెల్లూరులో మీడియా ప్రతినిధులపై దాడి విషయంలో ఆయన గురువారం హైదరాబాద్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో క్షమాపణ చెప్పారు. నెల్లూరులో ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తున్నాయని అనుకుంటున్న సమయంలో మీడియా ప్రతినిధులపై దాడి జరిగిందని, ఆ దాడికి తాను ఎంతో కలత చెందానని ఆయన అన్నారు.
సంఘటనపై విచారణ జరుపుతున్న రత్నారెడ్డి సమర్పించే నివేదికకు తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఘన విజయాన్ని సహించలేని తెలుగుదేశం పార్టీ నాయకులు తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలావుంటే, మీడియా ప్రతినిధులపై దాడి సంఘటనపై రత్నారెడ్డి నెల్లూరులో విచారణను ప్రారంభించారు. మీడియా ప్రతినిధులు గురువారంనాడు దాడికి సంబంధించి ఆధారాలను రత్నారెడ్డికి సమర్పించారు. సిడిలను, ఫొటోలను, వార్తా పత్రికల కథనాలను వారు రత్నారెడ్డికి సమర్పించారు.