ధర్మవరంలో ఆ ఎంపి ఓటు చెల్లదు: హైకోర్టు
అనంతపురం: హిందూపురం పార్లమెంటు సభ్యుడు నిజాముద్దీన్ ధర్మవరం మున్పిపల్ చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలు లేదని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఒక వేళ ఇప్పటికే ఆయన ధర్మవరంలో ఓటు హక్కు వినియోగించుకుని ఉంటే ఫలితాన్ని ఆపేయాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.
నిజాముద్దీన్ హిందూపురంలో మొదట ఎక్స్అఫిషియో సభ్యుడిగా తన పేరును నమోదు చేసుకున్నారని, అందువల్ల ధర్మవరంలో ఆయన సభ్యత్వం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ధర్మవరంలో నిజాముద్దీన్ ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని వెంకటరమణ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు.
అయితే ఇప్పటికే ధర్మవరం ఎన్నికల ఫలితాన్ని ప్రకటించింది. ఈ ఫలితాన్ని అధికారికంగా ప్రకటించకుండా ఆపే అవకాశం ఉంది. ఈ హైకోర్టు తీర్పు మిగతా మున్సిపాలిటీల విషయంలో కూడా సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఓటు హక్కు వినియోగించుకోవడంపై సమస్య తలెత్తే అవకాశం ఉంది.