గుంటూరు మేయర్ ఎన్నిక వాయిదా
గుంటూరు: గుంటూరు నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కాంగ్రెస్కు తలనొప్పిగా పరిణమించింది. మంత్రి కన్నా లక్ష్మి నారాయణ కుమారుడు కన్నా నాగరాజును మేయర్ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేయడంపై పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు వర్గీయులు గుర్రుగా ఉన్నారు. రెండు వేర్వేరు క్యాంపులు నిర్వహించారు. కోరం లేకపోవడంతో గుంటూరు కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కాంగ్రెస్లోని ఇరు వర్గాల మధ్య మేయర్ అభ్యర్థి విషయంలో విభేదాలు తలెత్తడంతో కోరం లేని పరిస్థితి ఏర్పడింది.
కన్నా లక్ష్మినారాయణ వర్గానికి చెందని 28 మంది కార్పోరేటర్లను కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ జానీ ఒక హోటల్ నుంచి నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయానికి ఒక బస్సులో తీసుకొని వచ్చారు. రాయపాటి వర్గానికి చెందిన ఏడుగురు కార్పోరేటర్లు ఆయన నివాసంలో సమావేశమై మంతనాలు జరిపారు. రాయపాటి సాంబశివరావు కుమారుడు కూడా కార్పోరేటర్గా గెలిచి మేయర్ పదవిని ఆశించడంతో కాంగ్రెస్కు ఈ తలనొప్పి వచ్చిపడింది.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఇద్దరు పార్టీ పరిశీలకులు కార్పోరేటర్ల అభిప్రాయాలను తెలుసుకుంటారని మహ్మద్ జానీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. గుంటూరు సమస్య రేపటికల్లా పరిష్కారమవుతుందని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు హైదరాబాద్లో అన్నారు. ఇక్కడికి తమ పరిశీలకుడిగా కె. ఆర్. అమోస్ను పంపారు. కాగా, తెలుగుదేశం పార్టీ తన కౌన్సిలర్లను పర్యటనకు పంపింది.